సీఎం కేసీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య ఫైట్ మరింత ముదిరింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. KTR ఫామ్ హౌజ్ పై డ్రోన్ కెమెరాలు ఉపయోగించారన్న ఆరోపణలతో.. రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి… నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు.
రేవంత్ రెడ్డికి.. సీఎం కేసీఆర్ కు మధ్య ఫైట్ ఇవాళ్టిది కాదు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుపాలయ్యారు. అప్పటినుంచి కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య రాజకీయ శతృత్వం పెరిగిపోతూ వస్తోంది.
టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ తో తలపడుతూ ఇండిపెండెంట్ గా తన పాపులారిటీని పెంచుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా.. పట్టణ ప్రగతి అని ప్రభుత్వ కార్యక్రమం మొదలుపెడితే.. పట్నం గోస అని రేవంత్ రెడ్డి బస్తీ బాట పట్టారు. ఇదే సమయంలో… కూకట్ పల్లిలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూముల కబ్జాకు పాల్పడ్డారంటూ టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేసి ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. ఐతే… తాను కాదు… మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌజ్ కట్టారంటూ మీడియాను రంగారెడ్డి జిల్లాకు తీసుకుపోయి హంగామా చేశారు రేవంత్ రెడ్డి. 70 ఎకరాల్లో రూల్స్ కు వ్యతిరేకంగా ఫామ్ హౌజ్ కట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించడంతో.. అది కేటీఆర్ ది కాదని.. రెంటెడ్ అని అధికార పార్టీ నుంచి వివరణలు వచ్చాయి.
అంతలోనే ఫామ్ హౌజ్ పై డ్రోన్ వివాదం
ఈలోపే…. KTR ఫామ్ హౌజ్ పై రేవంత్ రెడ్డి డ్రోన్ తో చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో.. రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.