కొమ్ములు విరిగిన నేతల కొత్త షో.. పసలేని విమర్శలతో ప్రజల్లో చులకన

Spread the love

గెలిస్తే.. సంపాదించుకుంటాం.. ఓడిపోతే కనిపించకుండా పోతాం.. ఇదీ టీడీపీ ఎమ్మెల్యేల తీరు.. ముఖ్యంగా పెదకూరపాడులో 2019 ఎన్నికల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తిన్న కొమ్మాలపాటి శ్రీధర్.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఈ మూడేళ్లలో నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుగారికి పెరుగుతున్నప్రజాదరణతో కొమ్మాలపాటి కొమ్ములు విరిగిపోయాయి. అందుకే ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి వచ్చి.. కొత్త షో మొదలుపెట్టారు.

బెల్లంకొండ మండలం మాచాయపాలెంలో కొమ్మాలపాటి తనయుడు మంచినీటి మోటారుకు 15 వేలు ఇచ్చి.. 15 లక్షలు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చారు. వారి మాటలు విన్న స్థానికులే.. టీడీపీ హయాంలో అభివృద్ధి చేసి ఉంటే.. మళ్లీ మిమ్మల్ని గెలిపించే వాళ్లు అన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. అని ప్రశ్నిస్తున్నారు. సొంతూరైన పెదకూరపాడులో ఇల్లు ఉన్నా.. ఎన్నికల అయిన మరుక్షణం మొహం చాటేసి.. హైదరాబాద్ కు మకాం మార్చేసింది మీరు కాదా..? ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టించి.. ఆ డబ్బుల కోసం చోటా నేతలను హైదరాబాద్ చుట్టూ తిప్పించుకుంటుంది మీరు కాదా..? అంటూ విమర్శలు చేస్తున్నారు.

 

ఎమ్మెల్యేగా నంబూరు శంకరరావు గారి హయాంలో జరుగుతున్న అభివృద్ధి చూసి కన్ను కుట్టిన కొమ్మాలపాటి శ్రీధర్.. వైషమ్యాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నంబూరు శంకరరావుగారు గుంటూరులో ఉంటారని విమర్శలు చేస్తున్నారు. కానీ సచివాలయానికి, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరులో నివాసంతోపాటు.. కార్యాలయం.. అలాగే నియోజకవర్గ నడిబొడ్డులోని క్రోసూరులో మరో కార్యాలయం ఏర్పాటు చేసి.. ప్రజలకు అందుబాటులో ఉన్నది ఆయనే. వీటితో పాటు అవినీతికి తావు లేకుండా ప్రజాసంక్షేమ పథకాలను అందించి.. ఎంతోమంది విద్యార్థులు జీవితాలను నిలబెట్టారు. అమ్మఒడి, విద్యా దీవెన వంటి 32 పథకాలతో ఎన్నో జీవితాలను మార్చారు. బీసీ, మైనారిటీల కోసం కమ్యూనిటీ హాళ్లు, షాదీఖానాలు ఏర్పాటు చేస్తున్నారు. మీ హయాంలో నియోజకవర్గ రోడ్ల దుస్థితి అందరికీ తెలిసిందే. అలాంటి రోడ్లను వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అమరావతి – బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్డు కోసం నాబార్డు నిధులు తెప్పించారు.

 

మీ పాలనలో పట్టించుకోని మాదిపాడు సత్తెమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే పెదకూరపాడు నియోజకవర్గానికి తలమానికమైన కృష్ణానదిపై వంతెనకు ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు తెచ్చారు. త్వరలో పనులు ప్రారంభించబోతున్నారు. నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీకి మీ హయాంలోనే అనుమతులు వచ్చినా.. కనీసం శిలాఫలకం వేయలేకపోయారు. కానీ ఎమ్మెల్యే శంకరరావు గారు.. కాలేజీ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. మీ పాలనలో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి సంపాదనపై మీరు దృష్టి పెడితే.. ప్రభుత్వాస్పత్రుల బాగు కోసం ఎమ్మెల్యే శంకరరావు శ్రమిస్తున్నారు. క్రోసూరులో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు, ఎన్నో గ్రామాలకు సురక్షిత మంచినీటి పథకాలు తెప్పించింది కూడా ఎమ్మెల్యేనే అని ప్రజలే చెబుతున్నారు. జలజీవన్ మిషన్ ద్వారా పెదకూరపాడు నియోజకవర్గానికి సుమారు 56 కోట్లు రూపాయలు మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు. ఏదో చుట్టపు చూపుగా వచ్చి పస లేని విమర్శలు చేసి ప్రజల్లో చులకన కాకండి అంటూ ప్రజలు హితబోధ చేస్తున్నారు.

(Visited 299 times, 1 visits today)
Author: kekanews