కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్వస్థతకు లోనయ్యారా.. సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. అయనకు సర్జరీ అయిందనీ.. అందుకే ఇన్నిరోజులు డ్యూటీకి రాలేదని అంతా చెప్పుకున్నారు. ఓ ఫొటోలో అమిత్ షా పూర్తిగా సన్నబడినట్టుగా ఉండటంతో… పుకార్లు గాలికన్నా వేగంగా తిరిగాయి. దీంతో.. ఏకంగా అమిత్ షానే రిప్లై ఇచ్చారు.
తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వారి కోసం షా లేఖను విడుదల చేశారు. అందులో తాను ఎలాంటి అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘కొన్ని సోషల్ మీడియాల్లో నా ఆరోగ్యం గురించి వార్తలు రాశారు. కొందరైతే ఏకంగా నేను చనిపోయినట్టు సంతాపాలు కూడా ప్రకటించారు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా. ఎలాంటి అనారోగ్య సమస్య లేదు.’ అని అమిత్ షా స్పష్టం చేశారు.
“గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొందరు నా ఆరోగ్యం మీద పుకార్లు ప్రచారం చేశారు.కొందరైతే ఏకంగా నా మరణం గురించి ట్వీట్లు చేసి సంతాపాలు ప్రకటించారు. ప్రస్తుతం దేశం కరోనా వైరస్ మహమ్మారి మీద పోరాడుతోంది. కేంద్ర హోంమంత్రిగా రాత్రింబవళ్లు నేను పనిలో నిమగ్నం కావడం వలన వాటి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. కొందరు భ్రాంతిలో బతుకుతూ ఆనందం పొందుతుంటారనే ఉద్దేశంతో నేను స్పందించలేదు. కానీ, మా పార్టీకి చెందిన కొన్ని లక్షల మంది నా ఆరోగ్యం గురించి చింతిస్తున్నారు. వారి ఆందోళనను నేను విస్మరించలేను. అందుకే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. నాకు ఎలాంటి జబ్బు లేదు. హిందూ నమ్మకాల ప్రకారం ఇలాంటి పుకార్లు మరింత ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అందుకే వారందరికీ చెబుతున్నా. మీరు ఈ పనికిమాలిన పనులు పక్కన పెట్టి నా పని నన్ను చేసుకోనివ్వండి. మీ పని మీరు చేసుకోండి. నా ఆరోగ్యం గురించి కంగారు పడిన పార్టీ కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. నా మీద ఎవరైనా పుకార్లు లేవనెత్తారో వారి మీద ఎలాంటి ద్వేషం లేదు. వారికి కూడా నా ధన్యవాదాలు.”అని అమిత్ షా చెప్పారు.
అమిత్ షా బక్కగయ్యారు.. ఏదో వ్యాధితో బాధపడుతున్నారంటూ.. కొందరు ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ కు… బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓ శక్తిమంతున్ని నేరుగా ఢీకొట్టడం చేతగాక.. ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాయన్నారు.