రామజన్మభూమి కేసులో అత్యంత సంచలనమైన.. అదే సమయంలో.. కోట్లాది మందికి ప్రజామోదమైన తీర్పును ఇచ్చింది సీజేఐ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం. ఇన్నాళ్లు వివాదాస్పదమైనదిగా పేరు పడ్డ రామజన్మభూమి మందిర్-మసీద్ ఉన్న 2.7 ఎకరాల భూమి రామజన్మభూమిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. శతాబ్దాలుగా నలుగుతూ.. ముస్లిం రాజుల పాలనలో ధ్వంసమైన చరిత్రను సుప్రీం ధర్మాసనం ఎలా తేల్చగలిగింది.. ఈ చిక్కుముడిని ఎలా విప్పగలిగింది అన్నది చాలా ఆసక్తి కలిగించే అంశం.
సుదీర్ఘ వాదనలు, రోజువారీ విచారణల తర్వాత.. ఓ గట్టి నిర్ణయం తీసుకుంది చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ టీమ్. భారత ఆర్కియాలజీ శాఖ ఇచ్చిన నివేదికనే ఇందులో అత్యంత ప్రధానమైనది. అందులోని తేలిన అంశాలు, వాస్తవాల ఆధారంగానే ధర్మాసనం ఓ నిర్ణయానికి రాగలిగింది. వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదు కట్టబడిందని… దశాబ్దాల పాటు అందులో ప్రార్థనలు చేశారన్న సంగతి పరిగణిస్తూనే… ఆ మసీదును ఎక్కడ నిర్మించారనేదానిపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.
మామూలుగా మసీదులు ఎటువంటి చోట కడతారు… మసీదు నిర్మాణంలో పాటించే పద్ధతులు ఏంటివని బేరీజు వేస్తూనే.. మసీదు ఉన్న స్థలం సంగతులు చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. సంప్రదాయపద్ధతిలో లేని.. ఓ కట్టడం ఉన్న స్థానంలో… మసీదు కట్టినట్టుగా ఆర్కియాలజీ విభాగం తేల్చిన అంశం ఆధారంగా.. బాబ్రీ మసీదు కంటే ముందే అక్కడ మరో మతస్తుల నమ్మకమైన ఆలయం అక్కడ ఉందని తేల్చింది. అందుకే.. బాబ్రీ మసీదుపై చేసిన వాదనలన్నీ వీగిపోయాయి. ఆఖరుకు ఆ స్థలం రామజన్మభూమిగా స్టాంప్ వేసేసింది సుప్రీం ధర్మాసనం. ఇదే ఇంపార్టెంట్ పాయింట్.
ఓ స్థలం యాజమాన్య హక్కులనేవి న్యాయ సూత్రాలకు అనుగుణంగానే నిర్ణయిస్తారని.. సీజేఐ విస్పష్టంగా చెప్పారు. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు నమ్ముతున్నారనీ… ఇదే సమయంలో రాముడు అయోధ్యలోనే పుట్టాడనేది నిర్వివాదాంశం… కానీ మసీదు ఎప్పుడు కట్టారు.. ఎవరు కట్టారనేది కోర్టులో రుజువు కాలేదని సీజేఐ అన్నారు. ఈ విషయాన్ని ముస్లింలు కూడా అంగీకరిస్తారని చెప్పడం మరో హైలైట్. ఈ ఆధారాలతోనే షియా వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ ను.. మరో హిందూ సంస్థ నిర్మోహి అఖాడా పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. హిందువులదైన రాంలుల్లా సంస్థదే రామజన్మభూమి అని తేల్చేసింది. అదీ సంగతి.
ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకుని.. 3 నెలల్లో తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది సుప్రీంకోర్టు. ఇదే అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని సూచించింది.