హైదరాబాద్ ఖాళీ – కొన్ని కఠిన నిజాలు

Hyderabad LockDown
Spread the love

(సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ కేక రీడర్స్ కోసం.. రచయితకు ధన్యవాదాలు)

కరోనా వ్యాప్తి హైదరాబాదులో లేదు అని జబ్బలు చరిచింది గవర్నమెంటు. అవును అప్పట్లో నిజంగా లేదు. మర్కజ్ తర్వాత హైదరాబాదులో వేగంగా పెరిగింది. కరోనా ఎక్కువగా లేకపోయినా జాగ్రత్తలు తీసుకున్నా, లాక్ డౌన్ విధించినా… కరోనా వ్యాప్తి ఆగలేదు. పైగా తొలుత మన వద్ద టెస్టింగ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఎక్కువ టెస్టులు చేయలేకపోయారు. ఇప్పటికీ 5 వేలకు టెస్టులు దాటడం లేదు. దీంతో మనం మేల్కొనేలోపు మెరుపు వేగంతో కోవిడ్ విస్తరించింది. దీంతో దాని ప్రభావం పడని రంగమే లేదు. హైదరాబాదు దారుణంగా దెబ్బతినింది. రెస్టారెంట్, మాల్స్, షాపింగ్, ట్రాన్స్ పోర్ట్ వంటి కొన్ని రంగాలు అయితే శూన్యం.

ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే… గవర్నమెంటు లాక్ డౌన్ ఎత్తేసినా జనం సెల్ఫ్ లాక్ డౌన్లో ఉన్నారు. అంతేకాదు, విపరీతంగా సొంతూళ్లకు వెళ్లిపోయారు. సగం హైదరాబాదు ఖాళీ అయ్యింది. విపరీతంగా టులెట్ బోర్డులు పెరిగాయి. ఒకట్రెండు చోట్ల తప్ప ఇతర చోట్ల ట్రాఫిక్ తగ్గింది. ఎందుకు.. ఏమయ్యారు వీళ్లు ఎక్కడికెళ్లారు? అని వేర్వేరుగా సమాచార సేకరణ చేయగా దొరికిన అంచనాలు ఇవి.

1. హైదరాబాదులో 15 లక్ష మంది ఐటీ రంగ నిపుణులు ఉన్నారని ఒక అంచనా. వీరందరికీ వర్క్ ఫ్రమ్ హోం. వీరి పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు. ఈ 15 లక్షల మందిలో హైదరాబాదు లోకల్ లక్షకు మించి లేరు. మిగతా వారిలో ఎపుడో సొంతిల్లు కొనుక్కుని తల్లిదండ్రులతో సహా ఇక్కడే సెటిలైన వారు మినహాయిస్తే… దాదాపు 9-10 లక్షల మంది హైదరాబాదు నుంచి వదిలేసి వెళ్లారు.

2. ఐటీ కాకుండా అనేక రంగాల కాల్ సెంటర్లు వర్క్ ఫ్రం హోం వీరు కూడా లక్షల్లోనే ఉంటారు. సుమారు 2 లక్షల మంది ఊళ్లకు తరలిపోయి ఉంటారని అంచనా.

3. మాల్స్, బట్టల దుకాణాలు అన్నీ మూత పడ్డాయి. వీటిలో పనిచేసే వారు 5 లక్షల దాకా ఉంటారని అంచనా. వీరిలో 80 శాతం మంది ఉద్యోగాలు పోాయాయి. కొందరికి నో వర్క్ నో పే కింద పెట్టుకున్నారు. వీరంతా ఊరికెళ్లారు.

4. రెస్టారెంట్ల సిబ్బంది మొత్తం ఒడిస్సా వారే. అవన్నీ మూతపడ్డాయి. ఈ రంగంలో సుమారు 2 లక్షల మంది ఉంటారని అంచనా. వీరంతా ఊళ్లకెళ్లారు.

5. హైదరాబాదు థియేటర్లు, వాటి కోసమే నడిపే దుకాణాలు మూతపడ్డాయి. వీటిలో పనిచేసే సుమారు లక్ష మంది ఉపాధి కోల్పోయి ఖర్చులు తట్టుకోలేక ఊరికెళ్లారు.

6. హైదరాబాదుని సాఫ్ట్ వేర్ కోచింగ్ హబ్ గా చూస్తారు. వీటి వల్ల వేల సంఖ్యలో హాస్టళ్లు ఉంటాయి. కోచింగే లేనపుడు హాస్టల్లో ఎందుకుంటారు. సుమారు 2-3 లక్షల మంది హాస్టళ్లు ఖాళీ చేసి ఊరెళ్లి పోయారు.

7. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఊపుమీదుండేది. దీనివల్ల విపరీతంగా నిర్మాణాలు కొనసాగేవి. వీటిలో కనీసం 4 -5 లక్షల మంది వివిధ రాష్ట్రాల వారు పనిచేసేవారు. వీరిలో 3 లక్షల మందికి పైగా సొంతూరికి వెళ్లిపోయారు. మిగతా వారు కూడా వెల్దాం అనుకునేలోపు కాస్త పనులు దొరకడంతో ఉండిపోయారు.

8. ఇంత పెద్ద సంఖ్యలో జనం ఖాళీ అయినపుడు బిల్డింగ్ మెయింటెనెన్స్ విభాగాల్లో ఉద్యోగాలకు పనిలేదు. దీంతో ప్లంబింగ్, ఎలక్ట్రికల్, మెయింటెనెన్స్ వంటి అనేక ఇతర వృత్తుల వారు తరలిపోయారు. వీరి సంఖ్య 2 లక్షలకు తగ్గదు.

9. ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులతో నడిచే చాలా చిన్నచిన్న దుకాణాలు వ్యాపారల్లేక ఇంకా తెరచుకోలేదు. ఆదాయం లేకుండా వీరెందుకు హైదరాబాదులో ఉంటారు?

10. ఇంత మంది హైదరాబాదును వదిలేసి వెళ్లాక వీరికి సర్వీసులు అందించే వీధి వ్యాపారులు, వృత్తిపని వారు, రకరకాల బ్రోకర్లు వీళ్లందరికీ ఇక్కడ పనేముంటుంది? మరి వారు పెద్ద సంఖ్యలో నగరాన్ని వదిలేశారు.

11. రవాణా రంగం కూడా 30 శాతమే నడుస్తోంది. మిగతా వారు వ్యాపారాలు లేక ఇక్కడ లేరు.

12. ఇక నిత్యం నగరానికి 5-6 లక్షల మంది వచ్చిపోతుంటారు. వారు కూడా రావడం లేదు. దీంతో టూరిజం, హాస్పిటాలీటీలో రంగంలో ఉద్యోగులు కూడా పోయాయి.

వీటన్నింటి నేపథ్యంలో ఇపుడు గవర్నమెంటు పెట్టబోయే లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్యలో పెద్దగా తేడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. చాలా పరిమితమైన ప్రయోజనం ఉండొచ్చు. పైగా సామాజిక వ్యాప్తి భారీగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న కేసులు బయటకు వస్తేనే లక్ష రెండు లక్షలు దాటే ప్రమాదం ఉంది.
మిత్రులు ఎవరి జాగ్రత్త వాళ్ళే చూసుకోవాలి. బతుకు పోరాటంలో కరోనాను మించిన పెనుముప్పును తప్పించుకునేందుకు ప్రయత్నించాలి.

(Visited 101 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *