మీడియాలో 50 శాతం డెస్కులు ఔట్.. కొత్త జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లు ఊస్టింగ్

Spread the love

మీడియాలో 50 శాతం డెస్కులు ఔట్. కొత్త జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లు ఊస్టింగ్
……………………………
స్పందించని జర్నలిస్టు సంఘాలు
…………
హైదరాబాద్:- కరోనా దెబ్బకు అన్ని రంగాల మాదిరి మీడియా రంగం కూడా అతలాకుతలం అవుతోంది. అయితే తొలిదెబ్బ జర్నలిస్టులపైనే పడుతోంది.
డెస్క్ లలో పనిచేసే సబ్ ఎడిటర్లను సాగనంపే చర్యలు మొదలయ్యాయి. జిల్లా టాబ్లాయిడ్ డెస్క్ ఇన్చార్జీలను యాజమాన్యం పిలిచి ఎంత మంది పనిచేస్తున్నారు, ఇందులో బాగా పనిచేసే వారి జాబితా ఇవ్వాలని చెప్పి పంపిస్తున్నట్లు తెలిసింది. కనీసం 50 శాతం మంది సబ్ ఎడిటర్లను ఇంటికి పంపే విధంగా జాబితా రూపొందించాలని సూచనప్రాయంగా చెప్పి పంపిస్తున్నారు. దీంతో డెస్క్ ఇన్చార్జీలు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటి వరకు అందరితో గొడ్డు చాకిరి చేయించుకుని, అందులో బాగా పనిచేసేవారు ఎవరంటే ఏం సమాధానం చెబుతామని సహచర మిత్రులతో వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో డెస్కులలో పనిచేసే వారి జాబితా యాజమాన్యం చేతుల్లోకి వెళ్లడం, దాని ప్రకారం 50 శాతం మంది సబ్ ఎడిటర్లను ఇంటికి పంపడం ఖాయంగా కన్పిస్తున్నది.
కరోనా కారణంగా పత్రికల సర్క్యూలేషన్ సగానికి పైగా తగ్గింది. దీంతో పత్రికలన్నీ సగం పేజీలు తగ్గించాయి. జిల్లా టాబ్లాయిడ్లను ఎత్తివేసాయి. పత్రికా రంగం ఇంత సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదు. ఈ కారణంగా పత్రికల మనుగడ ప్రశ్నర్ధకరంగా మారింది. దీంతో ప్రధాన పత్రికలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.
సాక్షి యాజమాన్యం 30శాతం ఆర్థికభారం తగ్గించునేందుకు కసరత్తు మొదలు పెట్టిందంటున్నారు. ముందుగా ఏపీలో దీన్ని అమలుచేయనునట్లు సమాచారం. డెస్క్ ఇన్చార్జీలను పిలిచి పనిచేయని వారిజాబితా సిద్దం చేయాలని కోరినట్లు సమాచారం. ఆంధ్రజ్యోతి, మిగతా యాజమన్యాలు కూడా అదే బాటలో ఉన్నాయంటున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న ఆంధ్రజ్యోతి మాత్రం 50 శాతం వరకు సిబ్బందిని తగ్గించే యోచనలో ఉంది. డెస్క్ లే కాకుండా మార్కెటింగ్, అడ్వర్టయిజ్ మెంట్ విభాగాలలో కూడా కోత విధిస్తున్నారు. అందరికన్నా ముందుగా సీపీఐ(ఎం) పార్టీ అధ్వర్యంలో నడుస్తున్న నవ తెలంగాణ పత్రిక పొదుపు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 50 శాతం మందికి పైగా తొలగించిన యాజమాన్యం తాజాగా పనికాలానికి మాత్రమే వేతనం చెల్లిస్తామని స్పష్టం చేసింది. తెలంగాణలో పాత జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లు మినహా కొత్త జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అన్ని యాజమాన్యాలు ఉమ్మడి నిర్ణయమా?
రాష్ట్రంలోని ప్రధాన తెలుగు పత్రికల యాజమాన్యాలు సిబ్బంది కుదింపు, తగ్గింపుపై ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయనే వార్తలొస్తున్నాయి. కలిసి కట్టుగా నిర్ణయం తీసుకుంటే తప్ప ముందుకు కదలలేమనే భావనతో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని అమలుపరుస్తున్నారు. కరోనా పేరుతో స్టాఫ్ ను తగ్గించుకుని ఆర్థిక గండం నుంచి బయటపడాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇదే దారిలో ఇంగ్లీషు పత్రికలు కూడా నడుస్తున్నాయి. డెక్కన్ క్రానికల్ పత్రి వారం రోజుల పాటు ప్రింటింగ్ మూసివేసి ఈ రోజే తిరిగి ప్రారంభించింది. ఆంధ్రభూమి పత్రిక ప్రచురణను తాత్కాలికంగా నిలిపివేసి, సిబ్బందిని ఇంటికే పరిమితం చేశారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక వార్షిక వేతనం ఆధారంగా కోతల స్లాబ్ లను అధికారికంగా ప్రకటించి అమలు చేస్తున్నది.
సీఎం కేసీఆర్ నిర్ణయమే కొంప ముంచిందా ?
ధనిక రాష్ట్రంగా చెప్పుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పేరుతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత విధించారు. దేశంలో తమది సంపన్న రాష్ట్రమని గంటకొట్టీ మరి చెప్పిన కేసీఆరే కోత నిర్ణయం తీసుకోవడం పత్రికా యాజమాన్యాలకు కలిసి వచ్చిందనే చెప్పాలి. కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తే తప్పు లేనప్పుడు, తాము సిబ్బందిని తగ్గిస్తే తప్పేమి లేదని అంటున్నట్లు తెలిసింది. ఏడాది కాలంగా తెలంగాణలో గతంలో మాదిరి ప్రభుత్వం నుంచి అడ్వర్టయిజ్ మెంట్లు రావడం లేదు. పూర్తిగా ప్రైవేటు సంస్థలు ఇచ్చే యాడ్స్ పైనే మనుగడ సాగిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం, కరోనా కారణంగా జర్నలిస్టుల బతుకులు బజారున పడుతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదనిపిస్తోంది.

(Source :WhatsApp)

(Visited 113 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *