కరోనా వైరస్ కారణంగా దారుణాలు జరుగుతున్నాయి. కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. కన్నవారికి బిడ్డలు… వయసుమళ్లినవారికి ఐనవారు లేకుండా పోతున్నారు. బంధాలు తెంచి.. మానవత్వం మంటకలిసేలా చేస్తోంది కరోనా వైరస్.
కనిపించని ఈ శత్రువు ఎవరిని ఎలా బలిచేస్తుందో ఇప్పటికీ అర్థం కావడంలేదు. తమిళనాడులో తాజాగా జరిగిన సంఘటన గురించి తెల్సుకుంటే మనసు కలుక్కుమనడం ఖాయం. కరోనా చేసే నష్టాన్ని అతిగా ఊహించుకుని.. ఓ వ్యక్తి తన కుటుంబాన్ని అతిపెద్ద ప్రమాదంలోకి నెట్టాడు.
తమిళనాడులోని చంగల్ పట్టు జిల్లా తిరుపోరూరులో దారుణం జరిగింది. సోమంజెరి గ్రామానికి చెందిన నలభై ఏళ్ల గణేశన్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. అతడికి కొద్దిరోజుల కిందటే కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా ఉందని తెలియక… అతడు కొద్దిరోజులుగా భార్య, పిల్లలతోనే కలిసి జీవించాడు. టెస్టుల్లో అతడితోపాటు.. భార్య, పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. వీళ్లంతా.. ఓ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. దీంతో.. అతడు తీవ్రమైన మనస్తాపం చెందాడు. తనవల్ల తన భార్య, పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్న బాధతో క్షణికావేశంలో తప్పుచేసేశాడు. తనకు వచ్చిన రోగం.. కారణంగా.. కుటుంబసభ్యులు బాధపడుతున్నారన్న బాధలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. హాస్పిటల్ ఐదో ఫ్లోర్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
స్పాట్ లోనే అతడు చనిపోయాడు. దీంతో.. కుటుంబసభ్యులు బోరుమని కన్నీళ్లు పెట్టుకున్నారు. చనిపోయేముందు.. కూడా తమతో .. ఎలా బతకాలి.. అంటూ బాధపడ్డాడని భార్య, పిల్లలు చెప్పారు. బాధపడొద్దని.. ధైర్యం చెబుతున్నా.. తాను మనసులో ఆవేదనతోనే ఉన్నాడని కుటుంబసభ్యులు చెప్పారు.
ఈ సంగతి తెల్సిన స్థానికులు తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని..కుటుంబసభ్యులకు సోకినా.. ధైర్యంతోనే , జాగ్రత్తలతోనే దాన్ని ఎదుర్కోవచ్చని.. నిపుణులు చెబుతున్నారు.