మోడీ – అమిత్ షా ద్వయాన్ని నిన్న బాగా పొగిడారు..
శివసేనకు తగిన శాస్తి అయ్యిందన్నారు…
పవార్ మామూలోడు కాదన్నారు.. కానీ ఏమయ్యింది.. ఓసారి చూద్దాం.
నవంబర్ 23న తెల్లారేసరికి మహారాష్ట్రలో రాజకీయ మారిపోయింది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసేశారన్న సంగతి ఉదయం 8 గంటలకల్లా దేశమంతటా పాకింది. రాజకీయ ఉద్ధండులు కూడా ఆ పరిణామానికి షాక్ అయ్యారు. అజిత్ పవార్ ఎమ్మెల్యే సపోర్ట్ లెటర్ తో వచ్చేశాడన్న నమ్మకం… ఎమ్మెల్యేలను కూడా తీసుకొస్తాడన్న నమ్మకంతో బీజేపీ ఈ చర్యకు దిగి ఉంటుందని అనుకున్నారు.
అప్పటికే ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ ఓసారి జరిగి ఉండటంతో… రహస్యంగా అతడే ఏదైనా నడుపుతున్నాడేమో అని డౌట్స్ కూడా వచ్చాయి. ఐతే.. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పొత్తు సిద్ధాంతాలకు వ్యతిరేకమనీ.. ఈ ప్రయత్నాలను బీజేపీ సుప్రీమ్ అమిత్ షా తిప్పికొట్టారని అందరూ అన్నారు. అమిత్ షాను మరోసారి అపర రాజకీయ చాణక్యుడితో పోల్చారు. మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే అన్న ఫడ్నవీస్ మాటలను కూడా హెడ్ లైన్స్ లో వేశారు. విశ్వాస పరీక్షలోగా బీజేపీ మ్యాజిక్ చేస్తుందని.. మోడీ – షా ద్వయం అనుకుంటే సాధ్యంకానిదేదీ ఉండదని అనుకున్నారు.
Read Also :
రగులుతోంది మహా పొద.. ఫడ్నవీస్ రాజీనామా
కానీ .. 3 రోజులు పూర్తయ్యేసరికి సీన్ మారింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తన నిజాయితీ చాటుకున్నారు. శివసేనకు, కాంగ్రెస్ కు ఇచ్చిన హామీ మేరకు.. తన కొడుకు లాంటి అజిత్ పవార్ ను దారికితెచ్చారు. ఎన్సీపీ చీలకుండా చరిత్రాత్మక స్ట్రాటజీ అమలుచేశారు. బీజేపీ సీఎం రాజీనామా చేసేలా చేశారు.
ఈ మొత్తం పరిణామాల్లో.. మొదట ప్రశంసలు దక్కించుకున్న బీజేపీ ఎత్తుగడ.. ఇపుడు రాజకీయ విమర్శలు ఎదుర్కొంటోంది. మరి చాణక్యుడు అమిత్ షానా.. ఉద్ధవ్ థాకరేనా… కింగ్ మేకర్ మోడీనా.. శరద్ పవారా.. అని అడిగితే ప్రస్థానం సినిమాలో చెప్పినట్టుగా.. ఈ మాట వాళ్లకు బాగా సరిపోతుంది.
“అమిత్ షా ఎత్తుగడ చూసి.. ఎన్నిపురాణాలు వెతికినా.. ఇతన్ని తేలగొట్టే పాత్రే లేదనిపించింది. తీర్పు ఇచ్చే శాసనం లేదనిపించింది. కానీ.. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూస్తే అసలు సంగతి బయటపడింది. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప.. హీరోలు, విలన్లు లేరీ నాటకంలో. నాయకుడిలో లోతుగా కూరుకుపోయిన పవర్ అనే అహం.. ప్రతి పార్టీని అధికారం వైపు నడిపించే దాహం.. పదవికోసం తపించే నేతను నడిపించే ఆశ. ఈ ఆశ ముదిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయి. ఆరోజు .. ఆ క్షణం.. వారి స్వాధీనంలో తీసుకున్న చర్యలకు జీవితమంతా లెక్కచెల్లిస్తూనే ఉంటారు. అది మంచైనా.. చెడైనా..” అని అనిపించక మానదు. అందుకే వీళ్లు తోపులు.. వాళ్లు తింగరోళ్లు.. అంటూ ఎవ్వరినీ అంత తొందరగా జడ్జ్ చేయకపోవడమే మంచిది.