దేశమంతటా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులు నలుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు. నలుగురు దోషులు ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలను జనవరి 22, 2020 ఉదయం 7 గంటలకు తీహార్ సెంట్రల్ జైల్లో ఒకేసారి ఉరి తీయాలని తీర్పుచెప్పింది. అప్పటివరకు ఉన్న 2 వారాల గడువును నిందితులు న్యాయపరమైన ప్రక్రియకోసం ఉపయోగించుకోవచ్చని సూచించింది కోర్టు.
తమ కూతురుని సామూహిక అత్యాచారం చేసి చంపేసిన కేసులో తనకు ఇన్నాళ్లకైనా న్యాయం చేయాలని కోర్టును ఎన్నోసార్లు వేడుకుంది మృతురాలి తల్లి ఆశా దేవి. దోషుల క్షమాభిక్ష పిటిషన్లు ఎక్కడా పెండింగ్ లో లేవనికోర్టుకు వివరించారు ఆమె తరఫు లాయర్. వాదనలు ముగిశాక… తీర్పుచెప్పిన జస్టిస్ నలుగురు నిందితులకు డెత్ వారెంట్ జారీచేశారు.
ఆరోజు ఏం జరిగిందంటే..
2012, డిసెంబర్ 16. అర్ధరాత్రి.
23 ఏళ్ల పారామెడికల్ స్టూడెంట్ బస్టాప్ లో బస్ కోసం ఎదురుచూస్తోంది. ఆమె స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు. బస్ రాగానే ఇద్దరూ ఎక్కారు. అప్పటికే బస్ లో ఉన్న ఆరుగురు యువకులు వారిపై కన్నేశారు. ఆమె స్నేహితుడిని కొట్టి బస్ లోనుంచి విసిరేశారు. ఆ తర్వాత.. ఆరుగురు కలిసి అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె మర్మాంగంలో బీరు సీసాలు దించి రాక్షసానందం పొందారు ఆ దుర్మార్గులు. పైశాచిక ఆనందం తర్వాత.. ఆమెను వివస్త్రనుచేసి.. నడిరోడ్డుపై వదిలేసి పారిపోయారు. ఆమె స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్నారు. హాస్పిటల్ లో చేర్పించారు. 13రోజుల పాటు ఆమె నరకయతన అనుభవించి… 29 డిసెంబర్ 2012న కన్నుమూసింది. ఆమె పోస్టుమార్టమ్ రిపోర్టు చూసి డాక్టర్లే షాక్ అయిన పరిస్థితి కనిపిచింది. దేశం ఆగ్రహంతో రగిలిపోయింది.
నలుగురు కాదు ఆరుగురు
ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసి అభియోగాలు మోపారు. ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలై అజ్ఞాతంలో జీవిస్తున్నాడు. మరో నిందితుడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇపుడు మిగిలిన నలుగురికి శిక్షలు ఖరారయ్యాయి.