సరస్వతి శిశుమందిర్ పూర్వ ఆచార్యులు, విద్యార్థుల మహా సమ్మేళనం సక్సెస్
పదివేల మంది వస్తారని అంచనా
15వేల మందికి పైగా హాజరు
మోహన్ భాగవత్ ప్రసంగానికి అద్భుత స్పందన
ప్రపంచంలోనే అతిపెద్దదని చెప్పిన రాయల్ బుక్, వండర్ బుక్, గిన్నిస్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శారధాధామం- సరస్వతీ విద్యాపీఠంలో శిశుమందిర్ పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం ప్రపంచ రికార్డు సృష్టించింది. పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న ఈ మహా సమ్మేళనానికి ఈసారి అనూహ్య రీతిలో స్పందన కనిపించింది.
తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలలనుంచి శిశుమందిర్ విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. పదివేల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేసినప్పటికీ… 15వేల మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. ప్రపంచంలోనే ఎక్కువమంది పూర్వ విద్యార్థులు హాజరైన సమ్మేళనంగా ఇది రికార్డులకెక్కింది.
RSS సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఈ భారీ సమ్మేళనానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్… బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు, శిశుమందిర్ పూర్వ ఆచార్యులు, విద్యార్థులు అటెండయ్యారు. మోహన్ భాగవత్ స్పీచ్ దాదాపు గంటన్నర పాటు సాగింది.
సమ్మేళనం ఎంత సక్సెస్ అయిందంటే.. సభా ప్రాంగణం మొత్తం ఉదయం 11 గంటలకే నిండిపోయింది. సభా స్థలం నిండిపోవడంతో… చాలామంది నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యాపీఠం ఆవరణలోనూ, దారి పొడవునా ఏర్పాటుచేసిన బుక్ స్టాల్స్ దగ్గర పూర్వ విద్యార్థులు నిలబడి స్క్రీన్ లలో కార్యక్రమాన్ని చూశారు. భోజనాలు సరిపోవని తెలియడంతో.. అప్పటికప్పుడు రెడీ చేయించారు నిర్వాహకులు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి 15వేల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అతిపెద్ద సమ్మేళనంగా శిశుమందిర్ విద్యార్థుల సమ్మేళనం చరిత్ర సృష్టించింది. రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ సమ్మేళనానికి హాజరై.. వేదికపై అవార్డు, గుర్తింపు పత్రం అందజేశారు. గత ప్రపంచ రికార్డు మూడున్నర వేల మంది పూర్వ విద్యార్థులతోనే నమోదై ఉందనీ.. ఈసారి 15వేల మంది హాజరుకావడం తాము కూడా ఊహించలేకపోయామని రికార్డ్ బుక్ సంస్థల ప్రతినిధులు చెప్పారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ సమ్మేళనానికి హాజరయ్యారని.. వారు కూడా రికార్డులను పరిశీలిస్తున్నారనీ నిర్వాహకులు చెప్పారు. ఇంతపెద్ద సమ్మేళనం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని తేలడం సంతోషంగా ఉందని శిశుమందిర్ పూర్వ విద్యార్థి పరిషత్ తెలిపింది.