అది 2008. డిసెంబర్ 13.
వరంగల్ లో ఇద్దరు ఇంజినీరింగ్ అమ్మాయిలపై ముగ్గురు యువకులు యాసిడ్ దాడి చేశారు. ఈ సంఘటన ఉమ్మడి ఏపీలోనే కాదు.. దేశమంతటా సంచలనం రేపింది. నిందితులు ముగ్గురు ఎస్.శ్రీనివాసరావు, పి.హరికృష్ణ, బి.సంజయ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత… తమపైనే కాల్పులకు ప్రయత్నించారంటూ.. ఆ ముగ్గురిని ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీగా ఉన్న V.C.సజ్జనార్ కు మహిళాలోకం నీరాజనాలు పలికింది. అభినందనలు తెలిపి రాఖీలు కట్టింది.
ఇది 2019. నవంబర్ 28.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర్లోని… తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర ప్రియాంక రెడ్డి అనే వెటర్నరీ డాక్టర్ పై దుర్మార్గులు అత్యాచారం చేసి.. దారుణంగా చంపేశారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ శివారులోని చటాన్ పల్లి అండర్ పాస్ దగ్గర ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. దేశమంతటా అత్యంత సంచలనం రేపిన ఈ ఘటన.. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గా సజ్జనార్ ఉన్నారు. ఆయనే దగ్గరుండి.. శంషాబాద్ పోలీస్ స్టేషన్ లోనే ఉండి కేసును దర్యాప్తుచేస్తున్నారు. తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర లారీలు అడ్డుపెట్టి అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్న నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సజ్జనార్.. వాళ్లని చంపెయ్యండి : పబ్లిక్
వరంగల్ స్వప్నిక యాసిడ్ దాడి కేసులాగే.. ప్రియాంకరెడ్డి కేసులోనూ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ప్రజలు. మహిళలపై దాడి కేసులను గతంలో హార్డ్ హ్యాండ్ తో డీల్ చేసిన సజ్జనార్.. ఈ కేసులోనూ నిందితులను నిర్దాక్షిణ్యంగా ఎన్ కౌంర్ చేయాలని కోరుతున్నారు. అత్యంత దారుణంగా.. సాటి మనిషిపై నమ్మకం కోల్పోయేలా జరిగిన ఇలాంటి సంఘటనల్లో నిందితులకు ఊచకోతే సరైన శిక్ష అంటున్నారు. యాజిటీజ్ గా పెట్రోల్ పోసి తగలపెట్టాలంటున్నారు.
ఇలా జరిగింది
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరు పశువైద్యశాలలో అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ గా ఉద్యోగం చేస్తుండేది ప్రియాంక రెడ్డి. తల్లిదండ్రులు, చెల్లెలు భవ్యతో కలిసి శంషాబాద్ లోని ఓ అపార్టుమెంట్లో ఉంటోంది. గచ్చిబౌలిలోని ఓ డెర్మటాలజిస్ట్ ను కలిసేందుకు… ఇంటినుంచి నిన్న సాయంత్రం 5.50కి బయల్దేరి వెళ్లింది. రాత్రి. 9.20 గంటల టైమ్ లో తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర ఆమె ప్రమాదంలో పడింది. పంక్చరైన ఆమె బైక్ ను బాగుచేస్తామంటూ ఇద్దరు యువకులు తీసుకెళ్లారు. అదే సమయంలో.. ఇంట్లో ఉన్న తన చెల్లి భవ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది ప్రియాంకరెడ్డి. తనకు భయంగా ఉందని ఫోన్ లో కంటిన్యుయస్ గా మాట్లాడుతూ ఉండాలని కోరింది. టోల్ ప్లాజా దగ్గరకు వెళ్లాలని చెల్లెలు సూచించినా.. వెళ్లనీయకుండా వాళ్లు అడ్డు ఉన్నారని ఫోన్ లో భయపడుతూ చెప్పింది. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ కట్టయ్యింది. మర్నాడు.. షాద్ నగర్ దగ్గర ఆమె శవమై .. కాలిపోయిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష అమలు చేయాలని ప్రతిఒక్కరు కోరుతున్నారు.