కళ్లను నీళ్లతో నింపేంత సెంటిమెంట్ ఈ పాట సొంతం. ఇది పాట కాదు.. అమ్మానాన్నల కష్టాలను తొలగించాలనుకునే ఓ పేదింటి కొడుకు గుండెల్లో పొంగిన ఉద్వేగం. ఈ పాట విన్నాక.. మరిన్ని సార్లు వింటారు. ఈ పాట మిమ్మల్ని వెంటాడటం ఖాయం. ఎందుకంటే.. కొన్ని పాటలు మనసులో గాఢమైన ముద్ర వేస్తాయి. మనల్ని మనకే గుర్తుచేస్తాయి. మన బతుకును.. మన గతాన్ని, వర్తమానాన్ని గుర్తుచేస్తాయి. బాధ్యతను గుర్తుచేస్తాయి.
ఈ పాటను రాసింది రాంబాబు.వై అనే వర్తమాన రచయిత, గాయకుడు. జానపద పాటల పూదోట తెలంగాణలో విరిసిన మరో గాన కుసుమం రాంబాబు. కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ అయిన రాంబాబుది.. వరంగల్ జిల్లా తొర్రూరు దగ్గర పల్లెటూరు.
ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పాటలతో ఆకట్టుకునే దోస్తుగాళ్లు ఎందరో ఉంటారు. అలాంటివారిలో ఒకడి భావోద్వేగం, భావావేశమే ఈ పాట. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా.. అంటూ తానే రాసి.. పాడి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడితే… టిక్ టాక్, ఫేస్ బుక్ లలో పిచ్చపిచ్చగా వైరల్ అయింది. రేలారేరేలా ఫేమ్ సింగర్ గంగ ఈ పాటను మెచ్చి.. రాంబాబును వెతికి పట్టుకుంది. తమ్ముడిలాంటి రాంబాబు టాలెంట్ మరింత మందికి చేరాలనే ఉద్దేశంతో ఆ పాటకు మంచి సంగీతం అందించి… యూట్యూబ్ లో రిలీజ్ చేసింది గంగ.
“అమ్మ మందలించినప్పుడు ఈ పాట పుట్టింది. ప్రతి ఇంట్లో ఉండే బాధలను గురించి ఈ పాట రాశాను.” అని రాంబాబు చెప్పారు. కొత్త గొంతను పరిచయం చేయడం సంతోషంగా ఉందని రేలారే గంగ అన్నారు. వినని వాళ్లు కింద లిక్ ద్వారా మస్ట్ గా వినండి. విన్నవాళ్లు మరోసారి వినండి.
“పాటమ్మతోటె ప్రాణం నాకు చదువులమ్మరా..
పేదోళ్లింట పుట్టిన పేగు బంధం నేనురా
అమ్మనాన్న రెక్కలాడితేనె బుక్కెడు బువ్వరా..
వాళ్ల రెక్కల కష్టపు సెమట చుక్కల ధారను నేనురా..”
ఇలా సాగిపోయే ఈ పాటను మీరూ ఓసారి చూడండి.