తాజ్ మహల్ ప్రపంచ వింతల్లో ఒకటి. అందమైన కట్టడాల్లో అద్భుతమైనది. అగ్రరాజ్యాధినేత ఈ తాజ్ మహల్ ను చూసేందుకు వచ్చాడంటే.. అంతకుమించిన వార్త మరోటి ఉండదు. ట్రంప్, మెలానియా.. భార్యభర్తల జంట.. ఈ ప్రేమ సౌధంలో గంటపాటు విహరించారు. తాజ్ మహల్ ప్రాంగణంలోకి అడుగుపెట్టడం మొదలు.. బయటకు వెళ్లిపోయేవరకు.. ఈ జంటతో ఉన్నది ఒకే ఒకరు. అతడే గైడ్. ఆ గైడ్ ఎవరనే ఆసక్తి అంతటా ఉంది.
ఆ గైడ్ పేరు నితిన్ కుమార్. ఆగ్రాకు చెందినవాడే. ట్రంప్ తాజ్ మహల్ ను వీడి వెళ్లిన తర్వాత.. నితిన్ కుమార్ ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. ట్రంప్ అతడి భార్య ఎలా ఫీలయ్యారో.. ప్రపంచానికి చెప్పింది నితిన్ కుమారే.
తాజ్ మహల్ ను చూడగానే.. ట్రంప్, మెలానియాలకు మాటలు రాలేదట. తాజ్ మహల్ స్టోరీని .. తాజ్ మహల్ ను ఎలా కట్టారో ట్రంప్ కు చెప్పాడు నితిన్ కుమార్. తాజ్ మహల్ వెనకున్న కథను కూడా వివరించాను. షాజహాన్, ముంతాజ్ మహల్ ల ప్రేమకథను తెల్సుకున్న తర్వాత.. ట్రంప్ భావోద్వేగానికి లోనయ్యాడట. తాజ్ మహల్ గురించిన వివరాలు చెబుతున్నకొద్దీ ట్రంప్, మెలానియాలు ఆసక్తి చూపిచారన్నారు.
ఇంక్రెడిబుల్ ( నమ్మశక్యంకాని అద్భుతం).. తాజ్ ను చూశాక ట్రంప్ చెప్పిన తొలి మాట ఇదేనన్నాడు నితిన్ కుమార్.
నితిన్ కుమార్… తాజ్ మహల్ దగ్గర గైడ్ గా ఎన్నాళ్లుగానో పనిచేస్తున్నాడు. అక్కడి పరిసరాల్లో ఉండే మహ్మద్ జాఫర్ .. నితిన్ కుమార్ గురించి మీడియాకు కొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పాడు. వీవీఐపీలకు గైడ్ గా… అధికారుల నిర్వహించిన పరీక్షలో నితిన్ కుమార్ ఎంపికయ్యాడట. .
నిన్నటివరకు నితిన్ కుమార్ ఎవరో తెలియదు. కానీ.. నిన్న ట్రంప్ దంపతులకు తాజ్ మహల్ గురించి వివరించిన తర్వాత.. నితిన్ కుమార్ ఫేమస్సయ్యాడు. ఎందుకంటే.. అగ్రరాజ్యాధిపతి.. ప్రపంచ అద్భుతం గురించి ఎలా ఫీలయ్యాడనేది.. నితిన్ కుమార్ ఒక్కడే దగ్గరనుంచి గమనించాడు. అతడు ఓ గైడ్ గా లైఫ్ టైమ్ కు కావాల్సిన ఫేమస్ ను సంపాదించేశాడు. అతడితో నిన్న అందరూ ఇంటర్వ్యూలు చేసి ఫొటోలు దిగిసంబరపడిపోయారు ఆగ్రావాసులు.
డేవిడ్ ఐసన్ హోవర్, బిల్ క్లింటన్ తర్వాత.. తాజ్ మహల్ ను సందర్శించిన మూడో అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ హిస్టరీలోకి ఎక్కారు.