మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, నేతలు చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు సీఎంకేసీఆర్. NRC, NPR, NRCలపైనా మాట్లాడారు. కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.
“ఇవాళ దేశం అట్టుడికిపోతా ఉంది. ఎందుకంత మొండి పట్టుదల ఎందుకుండాలి. అసెంబ్లీలో ఒపీనియన్ చెప్తాం. అసెంబ్లీలో CAA, NCR, NPR వ్యతిరేక తీర్మానం చేస్తాం. దేశం మునిగిపోయే పరిస్థితి ఉంటే.. అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ దెబ్బతింటే మనకే నష్టం. బయట దేశాలకు మనం వెళ్తే మనల్ని ద్రోహుల్లోగా చూస్తారు. మన పిల్లలకు బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. మతపరమైన దేశం నుంచి వచ్చారని అంటారు. మనల్ని దొంగల్లా , థర్డ్ క్లాస్ ఫెలోస్ లాగా చూస్తే మంచిది కాదు. రేపు రియాలిటీ. రేపు ప్రపంచంతో కలిసి బతికే బతుకే రియాలిటీ. వంద శాతం ఇది తప్పుడు బిల్లు. ఇది తప్పుడు ఆలోచన. దీనిపై ప్రధాని పునరాలోచన చేయాలని ఆయనకు విజ్ఞప్తిచేస్తున్నా. ఈ బిల్లుపై చాలా భిన్నాభిప్రాయాలున్నాయి.
దేశం కోసం అవసరమైతే నేనే రాష్ట్రం వదిలిపెట్టి వెళ్తా. సీఎంలు, ప్రాంతీయ పార్టీల నాయకులు చాలామంది నాతో మాట్లాడారు. ఢిల్లీలో మీటింగ్ పెడతామన్నారు. నేనే వద్దని చెప్పిన. హైదరాబాద్ లో సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతల మీటింగ్ పెడ్తాం. ఇక్కడే ఏర్పాటుచేస్తా అని నేనే చెప్పిన. అవసరమైతే.. 10 లక్షల మందితో ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏలను వ్యతిరేకిస్తూ సభ పెడతాం. దేశంలో ముస్లింల వాయిస్ వినిపిస్తాం. దేశంలో ప్రజల మూడ్ ఎలా ఉందో చెప్పడానికి అంత దూరం వెళ్తాం. ఇది ముస్లింల బాధ మాత్రమే కాదు. సిక్కులు, పార్శీలు, ఇలా ఒక్కొక్కరిని పక్కన పెడతారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న దేశంలో ఇదేం పరిస్థితి. సమస్యలు చాలా ఉన్నాయి. ఇండియాకు ఏరకంగానూ అది పనికొచ్చే చట్టం కాదు.
ఎన్నార్సీకి తొలి మెట్టే NPR అని ఎన్నార్సీ పత్రాల్లో ఉంది. అమిత్ షా ఓ రకంగా.. కిషన్ రెడ్డి మరోరకంగా చెబుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఓ వర్గాన్ని పక్కన పెడతాం అన్న ముచ్చటే తప్పు. వెరీ ఫండమెంటల్ రైట్ కు అది వ్యతిరేకం. సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని కొట్టిపారేయాలి ఓ నిమిషంలో. కేసీఆర్ ఏది చెప్పినా.. దేశానికి వినపడేలాగే చెబుతా. బ్లైండ్ గా మేం దేనికీ సపోర్ట్ చేయం. కశ్మీర్ లో ఆర్టికల్ 371 రద్దును సపోర్ట్ చేశాం. ఇది సపోర్ట్ చేయం.. అందరం కలిసి ఉండాలి. మేం సెక్యులర్ విధానాలనే కొనసాగిస్తాం” అన్నారు కేసీఆర్.