ఈ ఏడాది వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ పై ఇంగ్లండ్ సూపర్ ఓవర్ గెలుపు చాలామందికి నచ్చలేదు. అందుకే.. సూపర్ ఓవర్ విషయంలో ఐసీసీ రూల్ మార్చేసింది. ఇకనుంచి ఐసీసీ ప్రపంచకప్ సెమీస్ లేదా ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ టై అయితే.. బౌండరీల లెక్కన విజేతను ప్రకటించేది లేదని తేల్చిచెప్పింది. సూపర్ ఓవర్ టై అయితే.. మరో సూపర్ ఓవర్ ఆడించాలని.. అది కూడా టై అయితే.. మరో సూపర్ ఓవర్ ఆడించాలని.. నిర్ణయించింది. సోమవారం జరిగిన ఐసీసీ మీటింగ్ లో ఈ కీలకమైన డెసిషన్ తీసుకున్నారు.
ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. స్టోక్స్ పోరాటం… ఫైనల్ మ్యాచ్ టై.. సూపర్ ఓవర్ టై.. జరగడం అద్భుతమే. ఆ తర్వాత బౌండరీల లెక్కన ఇంగ్లండ్ ను వరల్డ్ కప్ విజేతగా ప్రకటించడంతో.. ఆ దేశం మొదటిసారిగా ప్రపంచకప్ ను ముద్దాడింది. ఐతే.. అభిమానుల మనసుల్లో మాత్రం కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని న్యూజీలాండే విజేత అయ్యింది. రూల్స్ కు జనం నుంచి వ్యతిరేక స్పందన రావడంతో.. ఐసీసీ .. భారత మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ బౌండరీ నిబంధనను మార్చుతూ.. ఐసీసీ రాజ్యాంగాన్ని సవరించింది. ఇకపై ఏ మేజర్ ఈవెంట్ లో అయినా.. సెమీ ఫైనల్, లేదా ఫైనల్ టై అయితే.. విజేత తేలేవరకు సూపర్ ఓవర్ ఆడిస్తూనే ఉంటారు. అదే గ్రూప్ దశలో మ్యాచ్ టై అయితే.. దానిని టైగానే పరిగణిస్తారు.