హైదరాబాద్లో ప్రారంభించిన ఎండ్ నౌ ఫౌండేషన్
ప్రస్తుత డిజిటల్ యుగంలో అంతా ఆన్లైన్ ప్రపంచంగా మారిన నేపథ్యంలో.. ఇంటర్నెట్ను కేవలం మంచికే ఉపయోగించుకోవాలని, విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే వాడుకోవాలని, చెడు వెబ్సైట్లు, తప్పుడు కంటెంట్ను అందించే సైట్లకు దూరంగా ఉంచాలని, అలాగే.. సైబర్ నేరాల బారిన పడకుండా రక్షించే ప్రధాన ఉద్దేశ్యంతో ఎండ్నౌ ఫౌండేషన్ ఆరేళ్లుగా సైబర్ రక్షణకోసం విశేష కృషి చేస్తోంది. అందులో భాగంగా.. దక్షిణాసియాలోనే మొట్టమొదటి డిజిటల్ వెల్ బీయింగ్ కౌన్సిల్ను హైదరాబాద్లో ప్రారంభించింది. కాలేజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా.. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ సంస్థతో ఎండ్ నౌ ఫౌండేషన్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఎండ్నౌ ఫౌండేషన్ చేపడుతున్న సైబర్ అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా.. GRIET డైరెక్టర్ డాక్టర్ జంధ్యా ఎన్ మూర్తి, ప్రిన్సిపల్ డాక్టర్ జె. ప్రవీణ్ సమక్షంలో ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ రాచమల్ల ఈ ప్రత్యేక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.
టీనేజ్లో ఉన్న యువతకు సురక్షితమైన ఆన్లైన్ పర్యవేక్షణతో పాటు.. వాళ్లలో ఆన్లైన్ నిర్వహణా సామర్థ్యాలను పొంపొందించేందుకు డిజిటల్ వెల్బీయింగ్ కౌన్సిల్ మార్గనిర్దేశం చేస్తుంది. ఇంటర్నెట్ ఎథిక్స్ మరింత మెరుగు పరచడం, డిజిటల్ వెల్నెస్ కోసం న్యాయవాదులు, మహిళలు, టీనేజ్ యువకుల్లో బాధ్యతాయుతమైనఆన్లైన్ వ్యవహార సరళిని ప్రోత్సహించడానికి డిజిటల్ వెల్బీయింగ్ కౌన్సిల్ కృషి చేయనుంది. ప్రతి కౌన్సిల్లో టీచింగ్ ఫ్యాకల్టీ నుండి ఒక కౌన్సిలర్, సైబర్ రక్షకులుగా కనీసం ఆరుగురు విద్యార్థులు ఉంటారు.
ఈ సందర్భంగా డిజిటల్ వెల్ బీయింగ్ కౌన్సిల్ సైన్ బోర్డులు, ప్రత్యేకమైన నోటీసు బోర్డులను అతిథులు ప్రారంభించారు. డిజిటల్ వెల్బీయింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో.. తక్షణమే కాలేజీలో సింగిల్ అండ్ డబుల్ క్రెడిట్ కోర్సును ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై డే లాంగ్ సెన్సిటైజేషన్ వర్క్ షాప్ నిర్వహించారు. సోషల్ మీడియాలో ఓవర్ షేరింగ్, ఫేక్ న్యూస్, ఐటి చట్టాలు, సోషల్ ఇంజనీరింగ్ నేరాలు, ఆన్లైన్ వ్యసనంతో పాటు.. సైబర్ థ్రెట్స్ వంటి అంశాలపై వర్క్ షాప్ లో పలువురు నిపుణులు ప్రసంగించారు. ఎండ్ నౌ ఫౌండేషన్లో ఇప్పటికే చురుగ్గా వ్యవహరిస్తున్న సైబర్ రక్షక్ టీమ్కు చెందిన 45 మంది విజయవాడ, వరంగల్, హైదరాబాద్ నుంచి ఈ ఎంవోయూ కార్యక్రమానికి హాజరయ్యారు. డిజిటల్ వెల్ బీయింగ్ కౌన్సిల్ గురించి మరిన్ని వివరాల కోసం end now foundation web site సందర్శించాలని నిర్వాహకులు కోరారు.